లోక్సభ సభ్యత్వానికి సోనియా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జాతీయ సలహా మండలి అధ్యక్ష పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. తిరిగి రాయబరేలీ నుంచి పోటీ చేస్తానని సోనియా గాంధీ ప్రకటించారు. జోడు పదవులు నిర్వహిస్తున్నారంటూ జయాబచ్చన్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వివాదం చెలరేగింది. జోడు పదవులు నిర్వహిస్తున్న సోనియా గాంధీపై కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పాటు కొన్ని ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
సోనియా గాంధీని రక్షించేందుకే పార్లమెంటును అర్థాంతరంగా నిరవధికంగా వాయిదా వేశారనే ఆరోపణలను తిప్పికొట్టడానికే సోనియా రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. కొన్ని పదవులను జోడు పదవుల నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపించాయి. జోడు పదవుల వ్యవహారంపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. అయితే ఆ విషయంలో మంత్రివర్గం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఆర్డినెన్స్ జారీ చేయాలనే ప్రయత్నాలు సోనియా సూచించినట్లు సమాచారం.
తనను రక్షించడానికి ప్రత్యేక ప్రయత్నాలేవీ చేయవద్దని కూడా సూచించారని అంటున్నారు. అయితే సోనియా రాజీనామాను హైడ్రామాగా బిజెపి కొట్టిపారేసింది. లాభాలు కలిగించే పదవుల్లో సోనియా వున్నట్లు రాజీనామాతో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. రాజీనామా వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు 10 జనపథ్ వద్ద ఆందోళనకు దిగారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలంటూ వారు నినాదాలు చేయడం ప్రారంభించారు.