కొందరు ఎంపిల వ్యాఖ్యలు బాధపెట్టాయి: సోనియా
న్యూఢిల్లీ: పార్లమెంటులో కొందరు సభ్యులు తనపై చేసిన వ్యాఖ్యలు తనను బాధ పెట్టాయని లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆమె మీడియా ప్రతినిధుల వద్ద విశ్వాసం వ్యక్తం చేశారు. జోడు పదవులపై ఆర్డినెన్స్పై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. రాయబరేలీ నుంచి తాను తిరిగి పోటీ చేస్తానని చెప్పారు. తాను ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఇందులో ఎలాంటి స్వప్రయోజనం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ విలువలు కాపాడడానికే రాజీనామాలు చేశానని ఆమె చెప్పుకున్నారు. ప్రస్తుత పరిస్థితికి తానేమీ కృంగిపోవడం లేదని ఆమె అన్నారు.
లోక్సభ సభ్యత్వానికి, జాతీయ సలహా మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగాను, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్గాను కొనసాగుతారు. రాజీనామాలతో సోనియాపై మళ్లీ ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజీనామాల ద్వారా సోనియా గాంధీ మరోసారి త్యాగనిరతిని చాటుకున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాజీవ్ శుక్లా కొనియాడారు.
సోనియా గాంధీ జోడు పదవులపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్కు ఫిర్యాదు చేసింది. తనకు ఫిర్యాదు అందితే సోనియా గాంధీపై కూడా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. తమకు అలాంటి ఫిర్యాదు ఏదీ రాలేదని స్పష్టం చేసింది. జోడు పదవుల నుంచి కొన్నింటిని మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.