పనిపిల్లకు శిరోముండనం: యజమానురాలి అరెస్టు
హైదరాబాద్: పనిపిల్ల సంతోషికి శిరోముండనం చేయించిన కేసులో యజమానురాలు లలితాదేవితో పాటు మరో ఇద్దరిని సికింద్రాబాద్లోని కుషాయిగుడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై ఆర్డీవో రాములు కూడా విచారణ జరుపుతున్నారు. దొంగతనం నేరం మోపి దళిత మైనర్ బాలిక సంతోషికి లలితాదేవి శిరోముండనం చేయించిందనే ఆరోపణలు వచ్చాయి.
తండ్రి నారాయణ చేతనే బలవంతంగా లలితాదేవి సంతోషికి శిరోముండనం చేయించింది. సంతోషి తల్లి ఆదిలక్ష్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే లలితాదేవి నివాసంలో పనిమనిషిగా కుదిరింది. బిడ్డ సంతోషిని లలితాదేవి కోరిక మేరకు వారం రోజుల క్రితం పనికి కుదిర్చింది. 200 రూపాయలు దొంగిలించిందనే ఆరోపణపై లలితాదేవి సంతోషికి కరెంట్ షాక్ పెట్టించింది. కర్రలతో కొట్టించింది. చివరగా తండ్రి నారాయణ చేతులతోనే శిరోముండనం చేయించింది. దీంతో 13 యేళ్ల సంతోషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తిన్నది.