ఫైళ్ల సందర్శన ముహూర్తం రేపు సాయంత్రం 5
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను రేపు (శనివారం) ఐదు గంటలకు సచివాలయంలోని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఛేంబర్లో చూపుతామని మంత్రులు ఎన్. రఘువీరారెడ్డి, బొత్సా సత్యానారాయణ చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై 20 రోజులు చర్చ చేసి తెలుగుదేశం పార్టీ శాసనసభా సమయాన్ని వృధా చేసిందని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఫైళ్లను ఇవ్వాళ్లే చూపాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరి కాదని వారన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను చూడడానికి ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరేసి నాయకులను అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఫైళ్లను చూడడానికి తమ నాయకులు వెళ్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత ఫైళ్లను రేపు సాయంత్రం చూపుతామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇదే విషయాన్ని సభలో చెప్పి వుంటే సభా సమయం వృధా అయి వుండేది కాదని, బిసి సంక్షేమంపై చర్చ జరిగి వుండేదని ఆయన అన్నారు.