టియస్ఆర్పై ఫిర్యాదు వచ్చింది: ఇసి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి టి. సుబ్బరామిరెడ్డిపై, తదితరులపై జోడు పదవులు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఎన్నికల కమీషన్ తెలియజేసింది. తొమ్మిది మందిపై తమకు ఫిర్యాదులు అందాయని, ఈ నెల 20వ తేదీన తమకు ఈ ఫిర్యాదులు చేరాయని తెలియజేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై, లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీపై కూడా తమకు అదే రోజు ఫిర్యాదులు అందాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన టి. సుబ్బరామిరెడ్డి కేంద్ర మంత్రిగా వుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. టిటిడి పదవి లాభదాయక పదవి కిందికి రాదని సుబ్బరామిరెడ్డి వాదిస్తున్నారు. తాను రాజీనామా చేయబోనని కూడా ఆయన చెప్పారు. సోమనాథ్ ఛటర్జీ లాభదాయక పదవులు నిర్వహించడం లేదని సిపియం ప్రకటించింది. సోమనాథ్ రాజీనామ చేయబోరని కూడా తెలియజేసింది. కపిల్ వాత్స్యాయన్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.