తెలంగాణ అంశం: బిజెపి ఆంధ్ర నాయకుల నిరసన
విజయవాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలన్న భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఆ పార్టీకి చెందిన ఆంధ్ర నాయకుల ఆగ్రహానికి గురైంంది. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు అంశంపై బిజెపిలో ఏకాభిప్రాయం సాధించేందుకు విజయవాడలో శనివారం ఉదయం సమావేశం నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డికి పార్టీ నాయకుల నుంచే నిరసన ధ్వనులు ఎదురయ్యాయి. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన గతంలో టిడిపితో కలిసి ఉన్నందువల్ల తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏమీ చేయలేకపోయామని, ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేనందువల్ల తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయడానికి మార్గం సుగమమైందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వంచించాయని ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. 1969, 72 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని ఆయన చెప్పారు.