గంగవరం ఘటనపై న్యాయవిచారణకు డిమాండ్
హైదరాబాద్: గంగవరం ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు శాసనసభలో డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతనే పోర్టు పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మత్స్యకారులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు విజయరామావు విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై ఏ విధమైన నమ్మకం లేదని సిపియం పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనగా ఆయన అభివర్ణించారు. గంగవరం ఘటనను ప్రతిపక్షాలు ముక్తకంఠంతో నిరసించాయి.