చరిత్రలో తొలిసారి చర్చ లేకుండా ఆమోదం
హైదరాబాద్: శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా చర్చ లేకుండా ద్రవ్య వినియోగ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రతిపక్షాల సభ్యులు నిరసనల మధ్యనే బిల్లును ఆమోదించారు. గంగవరం కాల్పుల సంఘటనపై అధికారులను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి పోడియం వద్ద నినాదాలు చేస్తుండగానే బిల్లులను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. మంగళవారం సభ సమావేశం కాగానే వివిధ పక్షాలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తోసిపుచ్చారు.
గంగవరం సంఘటనపై చర్చ జరగాలని, అధికారులను సస్పెండ్ చేయాలని, పోర్టు పనులను ఆపేయాలని ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. రెండో సారి తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాల సభ్యులు స్పీకర్ పోడియం వద్ద గుమికూడి నినాదాలు చేయడం సాగించారు. ఈ గందరగోళంలోనే స్పీకర్ బిల్లులను చదివి వినిపించారు. వాటిని సభ ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం నిరవధికంగా వాయిదా వేశారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.