తొలి వన్డేలో ఇంగ్లాండుపై భారత్ విజయం
న్యూఢిల్లీ: ఇంగ్లాండుపై భారత్ తొలి క్రికెట్ వన్డే మ్యాచ్లో ఘన విజయం సాధించింది. బ్యాట్స్మెన్ విఫలమైన దశలో బౌలర్లు విజృంభించడంతో భారత్కు 39 పరుగుల తేడాతో విజయం వశమైంది. భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్ విజృంభనతో ఇంగ్లాండు బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. హర్బజన్ 31 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. భారత బ్యాట్స్మెన్లో హర్బజన్ అత్యధిక పరుగులు చేయడం గమనార్హం. అతను 37 పరుగులు చేశాడు. విశేషమైన బౌలింగ్ ప్రతిభను కనబరిచినందుకు అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండు బ్యాట్స్మెన్లో పీటర్సన్ 46 పరుగులు చేయగా, ప్లింటాఫ్ 41 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు అవుట్ అయింది. ఇంగ్లాండు బౌలర్ల ముందు భారత బ్యాట్స్మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. ద్రావిడ్ 34 పరుగులు చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 28 పరుగులు చేశాడు. ఇంగ్లాండు బౌలర్లలో కబీర్ అలీ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అండర్సన్కు రెండు వికెట్లు దక్కాయి. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండుకు ఆదిలో గట్టి దెబ్బ తగిలింది. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో ఇద్దరు ఇంగ్లాండు బ్యాట్స్మెన్ చాలా తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టాడు. అయితే పీటర్సన్, ప్లింటాఫ్లు కలిసి భారత్ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ ముందుకు సాగారు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో మ్యాచ్ భారత్ చేతి నుంచి జారిపోయినట్లే కనిపించింది. అయితే యువరాజ్ పీటర్సన్ వికెట్ తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరసగా వికెట్లు పతనమవుతూ వచ్చాయి. ప్లింటాఫ్ను హర్బజన్ అవుట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది. యువరాజ్కు రెండు వికెట్లు దక్కగా చివరి వికెట్ను తీయడం ద్వారా పఠాన్ మూడు వికెట్లను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండు 38.1 ఓవర్లలో 164 పరుగులు చేసి అవుట్ అయింది.