ఇంత దివాళాకోరు విపక్షాన్ని చూడలేదు: వైయస్
హైదారాబాద్: తెలుగుదేశం వంటి దివాళాకోరు ప్రతిపక్షాన్ని తాను తన 28 యేళ్ల అనుభవంలో ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభలో గందరగోళం సృష్టించి ఏదో విధంగా సభను స్తంభింపజేసి వాయిదా వేయించడమే పనిగా తెలుగుదేశం సభ్యులు వ్యవహరించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలోనూ, గంగవరం సంఘటన విషయంలోనూ తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ప్రస్తుత శాసనసబా సమావేశాలను బడ్జెట్ సమావేశాలు అనడానికి వీలు లేదని, ఎల్లంపల్లి, శ్రీపాదసాగర్ సమావేశాలు అంటే సరిపోతుందని ఆయన అన్నారు.
శాసనసభా సమావేశాల్లో తెలుగుదేశం సభ్యులు కొండను తవ్వి కనీసం ఎలుకనైనా పట్టలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. గంగవరం సంఘటన విషయంలో ఐఎయస్ అధికారి చేత విచారణ జరిపించడానికి సిద్దమయ్యామని ఆయన గుర్తు చేస్తూ తెలుగుదేశం సభ్యులు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, విచారణ జరిపించకుండా ఎలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తప్పు చేసినవారెవరైనా సహించబోమని తాము పదే పదే చెప్పినా వినిపించుకోలేదని ఆయన అన్నారు. గంగవరం పోర్టు పనులను ఆపేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ను కూడా ఆయన తోసిపుచ్చారు. పనులు గంగవరంలో జరగడం లేదని, దిబ్బపాలెంలో జరుగుతున్నాయని, అందువల్ల పనులు ఆపాల్సిన అవసరం లేదని తాము ఎంత చెప్పినా వినిపంచుకోవడం లేదని ఆయన అన్నారు. గంగవరం సంఘటనలో పోలీసులకు కూడా దెబ్బలు తగిలిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.