రేపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్: ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలకు ఇళ్లు నిర్మించే రేపు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి షబ్బీర్ అలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. గ్రామీణ నిరుపేదలకు 17 లక్షల 35 వేల ఇళ్లు నిర్మించనున్నట్లు, పట్టణ ప్రాంతాల్లో 75 వేల ఇళ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం అమలుకు అవసరమైతే కొన్ని చోట్ల దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 21 లక్షల 97 వేల పింఛన్లు చెల్లించనున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్లను కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రూ. 200కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం రైతుల వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లను బిగించుకునే గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. మరో ఆరు లక్షల వాహనాలకు మోటారు వాహనాల పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా 25 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం తరఫున 5,200 రూపాయలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో నిర్వాసితులకు పది లక్షల రూపాయల లోపు నష్టపరిహారం చెల్లించే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గంగవరం సంఘటనపై కూడా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం.