భారత్కు విజయాన్ని అందించిన రైనా, ధోనీ
ఫరీదాబాద్: భారత్ ఇంగ్లాండుపై రెండో వన్డే మ్యాచ్లోనూ విజయం సాధించింది. భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైనప్పటికీ సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ సమయస్ఫూర్తితో, సంయమనంతో బ్యాటింగ్ చేసి భారత్కు విజయాన్ని అందించారు. సురేష్ రైనా పరిణతితో కూడిన బ్యాటింగ్ ప్రతిభను కనబరిచాడు. 49 ఓవర్లలో ఇంగ్లాండు ఉంచిన 226 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలుపును అందుకుంది. రైనా 81 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. ధోనీ 38 పరుగులు చేశాడు. ఆట చివరిలో ఇర్ఫాన్ పఠాన్తో కూడి రైనా బ్యాటింగ్ చేశాడు. గంభీర్, సెహ్వాగ్ కాస్తా మెరుగైన ప్రారంభాన్నే ఇస్తున్నారని అనుకుంటున్న సమయంలో వరుసగా భారత వికెట్లు పడ్డాయి.
సెహ్వాగ్ 26 పరుగులు చేయగా, గంభీర్ 29 పరుగలు చేశాడు. ద్రావిడ్, కైఫ్, యువరాజ్ సింగ్లు పూర్తిగా నిరాశపరిచారు. కైఫ్ పరుగులేమీ చేయకుండానే అవుట్ కాగా ద్రావిడ్, యువరాజ్లు తక్కువ స్కోర్కే అవుటయ్యారు. భారత్ 92 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో సురేష్ రైనా, ధోనీ భారత్ను విజయ పథం వైపు నడిపించారు. ఇంగ్లాండు బౌలర్లలో బ్లాక్వెల్ రెండు వికెట్లు తీసుకోగా, ప్లింటాఫ్, అండర్సన్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు ఇంగ్లాండు 49.5 ఓవర్లలో 226 పరుగులు చేసి అలవుట్ అయింది. ఇంగ్లాండు బ్యాట్స్మెన్లో పీటర్సన్ 71 పరుగులు చేయగా, ఓపెనర్ స్ట్రాస్ 66 పరుగులు చేశాడు. శ్రీశాంత్, రమేష్ పొవార్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. హర్బజన్, పఠాన్, యువరాజ్లకు ఒక్కటేసి వికెట్లు దక్కాయి. ఈ విజయం భారత్ ఇంగ్లాండుపై 2-0 స్కోర్తో సిరీస్లో ముందంజలో వుంది.