నకిలీవని రుజువు చేస్తే రాజీనామా: నాగం సవాల్
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో తమ వద్ద ఉన్న పత్రాలు నకిలీవని రుజువు చేస్తే శాసనసభ్యాత్వానికి రాజీనామా చేస్తానని తెలుగుదేశం శాసనసభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎల్లంపల్లి విషయంలో ప్రభుత్వం కంచె చేను మేసిన విధంగా వ్యవహరిస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పత్రాలను ప్రభుత్వమే ఫోర్జరీ చేసిందని ఆయన విమర్శించారు.
తమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి ఇదే మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయించని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేత తెలంగాణపై మాట్లాడించలేని తెరాస నాయకులే దద్దమ్మలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని, లక్ష్యాన్ని తెరాస నాయకులు విస్మరించి సన్యాసులు, దద్దమ్మల్లా మారారని ఆయన అన్నారు. తెరాస చిరునామాయే గల్లంతవుతుందని ఆయన అన్నారు.