వ్యవసాయ ఉత్పత్తి పెంపునకు ప్రణాళిక: వైయస్
నల్లగొండ: వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (యస్యల్బిసి) సొరంగ మార్గానికి నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఆయన ఆదివారంనాడు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు చైతన్య యాత్రలను కూడా ప్రారంభించారు.
రైతులకు వ్యవసాయాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా చైతన్య యాత్రల్లో సలహాలు ఇస్తారని ఆయన చెప్పారు. వ్యవసాయ, ప్రారిశ్రామిక రంగాలు రెండూ తమకు ప్రధానమేనని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి రైతు చైతన్య యాత్రలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. యస్యల్బిసి వ్యాసాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తూ ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించారు.