బెంగుళూర్ కన్నా హైదరాబాద్ మిన్న: ఇన్ఫోసిస్ సియఫ్ఒ
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హైదరాబాద్ భారత్లో అత్యంత మెరుగైన ప్రదేశమని ఇన్ఫోసిస్ ఛీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ టి.వి. మోహన్ దాస్ పాయ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ పట్ల అభిమానాన్ని, కర్ణాటక రాజధాని బెంగుళూర్ పట్ల నిరాశను ఆయన దాచుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నవి చాలా బాగున్నాయని, నిర్మొహమాటంగా చెప్పాలంటే ఐటికి హైదరాబాద భారత్లో అత్యుత్తమైందని ఆయన అన్నారు.
హైదరాబాద్లో రోడ్లు బాగున్నాయని, ముఖ్యమంత్రి చాలా సానుకూల చలనశీలి అని, చాలా మంది ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారని, హైదరాబాద్ నూత్నంగా ఉన్నందున ఇక్కడికి వస్తే వినూత్నంగా కనిపిస్తుందని, ఐటి ఇండస్ట్రీకి ఇది మంచి ప్రయత్నమని, అందుకే తాము ఉత్సాహం చూపామని ఆయన అన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగూళూర్ అంత ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగుళూర్లో ఐటి నైతికత చాలా తక్కువని, ప్రజల సెంటిమెంట్లు బాగా లేవని, ప్రజలను భ్రమ పెట్టలేమని, ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పోటీ మంచిదని, బెంగుళూర్లో తమకు అంత బాగా లేదని ఆయన అన్నారు. బెంగుళూర్ ప్రజలు తమను కోరుకోవడం లేదని, హైదరాబాద్ ఐటి ఇండస్ట్రీని కోరుకుంటోందని, హైదరాబాద్ తమను కోరుకుంటోందని, తమను కోరుకునే చోటికి మనుషులు వెళ్తారని ఆయన అన్నారు. గత రెండేళ్ల లెక్కలు తీస్తే బెంగుళూర్ కంపెనీలు బెంగుళూర్లో కన్నా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన చెప్పారు. ఐదేళ్ల క్రితం భారత ఐటి పరిశ్రమల్లో బెంగుళూర్లో 65 శాతం ఉంటే, అది ప్రస్తుతం 25 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ఐటి పరిశ్రమ ఉత్తమ ఉద్యోగాలను కల్పిస్తున్నందున కోల్కత్తా, జైపూర్, హైదరాబాద్ల్లో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోందని, అక్కడి రాజకీయ నాయకుల ఆసక్తి వల్లనే ఇది జరుగుతోందని ఆయన అన్నారు.