యువరాజ్ సెంచరీ: భారత్ మూడో విజయం
మార్గోవా: ఇంగ్లాండుపై వరుసగా మూడో వన్డే మ్యాచ్లో విజయం సాధించి భారత్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. దీంతో ఏడు వన్డేల క్రికెట్ సిరీస్లో భారత్ ఇంగ్లాండుపై 3-0 ఆధిక్యతను సాధించింది. యువరాజ్, సురేష్రైనాల అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో భారత్ భారీ స్కోర్ను సాధించగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 294 పరుగులు చేసింది. 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండు చతికలపడింది. ఇర్ఫాన్ పఠాన్ తొలి ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండు నడ్డి విరిచాడు. 83 పరుగులకే ఇంగ్లాండు ఐదు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కాలింగ్వుడ్ జోన్స్తో కలిసి భారత బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రయత్నం, అద్భుతమైన బ్యాటింగ్ పనికి రాకుండా పోయాయి.
కాలింగ్ వుడ్ సిక్సర్లు, ఫోర్లతో 94 బంతుల్లో 93 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో కాలింగ్ వుడ్ హర్బజన్ బౌలింగ్లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు దారి తీశాడు. ఆ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్మెన్ భారత బౌలర్లను ఏ మాత్రం ఎదుర్కోలేకపోయారు. జోన్స్ 32 పరుగులు చేశాడు. ప్రార్ 37 పరుగులు చేశాడు. బ్యాటింగ్ లైనప్లో వన్డవున్లో దిగి 36 పరుగులు చేసిన ఇర్ఫాన్ పఠాన్ నాలుగు ప్రధానమైన వికెట్లు పడగొట్టాడు. అగార్కర్, హర్బజన్ సింగ్లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. రమేష్ పొవార్కు ఒక వికెట్ లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మంచి ప్రతిభను కనబరిచింది. ఓపెనర్ సెహ్వాగ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశ పరిచినా, ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, రాహుల్ ద్రావిడ్ చక్కటి బ్యాటింగ్ చేశారు. ద్రావిడ్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్తో ఇంగ్లాండు బౌలర్లను చీల్చి చెండాడు. 76 బంతులను ఎదుర్కొన్న యువరాజ్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి ప్లింటాఫ్ బౌలింగ్లో అవుటయ్యాడు. వన్డేల్లో యువరాజ్కు ఇది ఏడో సెంచరీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు యువరాజ్కు దక్కింది. రైనా యువరాజ్ కలిసి చెలరేగి ఆడుతుంటే ఇంగ్లాండు బౌలర్ల చేతలుడిగాయి. గత మ్యాచ్లోనూ రాణించి భారత్కు విజయాన్ని అందించిన రైనా 61 పరుగులు చేశాడు. ప్లింటాఫ్ మూడు వికెట్లు తీసుకోగా, కాలింగ్ వుడ్, ప్లంకెట్, బ్లాక్వెల్లు ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు.