మరో మూడేళ్ల ఆశతోనే వైయస్ ప్రకటనలు: తెరాస
హైదరాబాద్: తెలంగాణ ఇప్పట్లో రాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అనడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి వి. ప్రకాశ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం తగదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన రాజశేఖర్ రెడ్డి మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరికతోనే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మరో మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని రాజశేఖర్ రెడ్డి ఆశపడడంలో తప్పు లేదని, అయితే పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరి కాదని, అది ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదని, అందుకే రాజశేఖర్ రెడ్డికి ఆ విషయాన్ని తాము పదే పదే చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి హుందాగా వ్యవహరించడం లేదని, తెలంగాణ వాదాన్ని బలహీనపరిచే ప్రయత్నానికి పాల్పడుతున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన అన్నారు.