కాంట్రాక్టర్ల డబ్బులు కొత్త కాదు: మావోయిస్టు నేత
మహబూబ్నగర్: కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం కొత్త కాదని సిపిఐ (యంయల్) మావోయిస్టు మహాబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి సాంబశివుడు అన్నారు. ఈ మేరకు ఆయన పేర శుక్రవారం మీడియా కార్యాలయాలకు ఒక లేఖ అందింది. తాము వసూలు చేసిన దాని కన్నా ఎన్నో రెట్లు కాంగ్రెస్ వసూలు చేసిందని ఆయన అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లకు చెందిన డబ్బులు నక్సలైట్లకు చేరవేస్తున్న వారు పట్టుబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ శాసనసభ్యులు 400 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తాము తీసుకున్న డబ్బులను ప్రజా ఉద్యమాలకు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో తాము 60 కోట్లు తీసుకున్నామనే పోలీసు అధికారి ఆరోపణను ఖండించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి భరతసింహారెడ్డి తీసుకున్న 35 కోట్ల రూపాయల మాటేమిటని ఆయన అడిగారు.