ప్రసారభారతి ఆదాయం రూ 1238 కోట్లు
హైదరాబాద్: మొదటిసారిగా ప్రసారభారతి రెవెన్యూ వెయ్యి కోట్ల రూపాయలు దాటింది. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ప్రసారభారతి 1238 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 48.89 శాతం ఎక్కువ. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసారభారతి ముఖ్య కార్య నిర్వహణాధికారి కె.ఎస్. శర్మ ఈ వివరాలు వెల్లడించారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడం ద్వారా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ భారీగా పెంచుకుంటామని శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
గత సంవత్సరం వచ్చిన మొత్తం ఆదాయంలో 968 కోట్ల రూపాయలు దూరదర్శన్ ద్వారా వచ్చింది కాగా ఆకాశవాణి ద్వారా 270 కోట్లు లభించింది. ప్రైవేట్ రంగంలో రేడియోల ఏర్పాటుకు లైసెన్స్లు ఇవ్వడం వల్ల ఆకాశవాణికి వచ్చే నష్టం ఏదీ ఉండదని, ఆకాశవాణి ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఒక విశ్వసనీయమైన రేడియోగా ముద్ర వేసుకున్నదని ఆయన అన్నారు.