తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టండి: దత్తాత్రేయ సవాల్
హైదరాబాద్: చిత్తశుద్ధి, నిజాయితీ వుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కాంగ్రెస్కు సవాల్ విసిరారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని యుపిఎ సబ్ కమిటీకి బిజెపి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడం లేదని చెప్పడం కాలయాపన చేయడానికేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
తాము యుపిఎ సబ్ కమిటీకి సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదని, యుపిఎ సబ్ కమిటీకి చట్టబద్దత లేదని ఆయన అన్నారు. చిత్తశుద్ధి వుంటే బిల్లు ప్రవేశపెట్టాలని, తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. లేదంటే ప్రధాని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రెండేళ్లుగా ఏ నిర్ణయమూ తీసుకోని యుపిఎ సబ్ కమిటీ నెపం తమ మీదికి నెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి ప్రజలను దగా చేయడం సరి కాదని ఆయన అన్నారు.