జామా మసీదు వద్ద పేలుళ్లు: ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: పాత ఢిల్లీలోని జామా మసీదు సమీపంలో శుక్రవారం రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనలో 12 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుళ్ల సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే జామా మసీదుకు ఏ విధమైన నష్టం జరగలేదు. దాదాపు 15 నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు సంభవించినప్పుడు మసీదులో వంద మందిదాకా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు, అంబులెన్స్లు చేరుకున్నాయి. మసీదు సమీపంలో ట్రాఫిక్ను నిలిపేసి, పోలీసులు ఆ పరిసరాలను చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు. మొదటి పేలుడు షాహీ గేటు వద్ద జరిగింది. సంయమనం పాటించి శాంతి సామరస్యాలను పాటించాల్సిందిగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు కమీషనర్ పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిని కాపాడాలని షాహీ ఇమామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుడు పదార్థాలను పాస్టిక్ సంచుల్లో పెట్టి పేల్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించారు.