శ్రీనగర్లో వరుస పేలుళ్లు: 5గురు మృతి
శ్రీనగర్: ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రీనగర్లో శుక్రవారంనాడు వరస బాంబు పేలుళ్లు సంచలనం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఐదుగురు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారు. మిలిటెంట్లు ఈ దారుణాలకు పాల్పడ్డారు. భద్రతా బలగాలను లక్ష్యంగా ఎంచుకుని మిలిటెంట్లు ఒక గంట వ్యవధిలో ఐదు చోట్ల బాంబులు పేల్చారు. తొలి బాంబు పేలుడు సంఘటన రద్దీగా ఉండే లాల్ చౌక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు బియస్యఫ్ అధికారులతో పాటు ఐదుగురు గాయపడ్డారు. ఆ తర్వాత 15 నిమిషాలకే మగర్మాల్ బాగ్ బంకర్ వద్ద భద్రతా బలగాలను లక్ష్యంగా ఎంచుకుని బాంబులను పేల్చారు. ఇక్కడ ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
మూడో దాడి రద్దీగా ఉండే హరిసింగ్ స్ట్రీట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక మహిళతో పాటు నలుగురు గాయపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో బాటమూలూ ప్రాంతంలోని పోలీసు వాహనంపై మిలిటెంట్లు బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు గాయపడ్డారు. బియస్యన్యల్ కేంద్ర కార్యాలయం వెలుపల బాంబు దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ అనుకూల తీవ్రవాద సంస్థ జమైతే - ఉల్ - ముజాహిదీన్ చెప్పుకుంది.