కరెంట్ షాక్తో రైతు మృతి: గ్రామస్థుల ఆందోళన
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో అర్థరాత్రి వచ్చిన కరెంట్తో మోటార్ నడిపించడానికి వెళ్లిన ఒక యువరైతు గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత షాక్ తగిలి మరణించాడు. దీంతో చింతకుంట గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురై రాస్తా రోకోకు దిగారు. కలెక్టర్ను ఘెరావ్ చేశారు. అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలవరకు కరెంట్ ఇస్తున్నందున మోటారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించిన రాజేందర్ అనే యువరైతు కరెంట్ షాకుతో మరణించాడు.
రైతు శవంతో చింతకుంట గ్రామస్థులు మొదట ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత ధర్నా చేయడానికి శవాన్ని చేతుల మీద మోసుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్నారని తెలుసుకుని గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. కలెక్టర్ను ఘెరావ్ చేశారు. మరణించిన రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కలెక్టర్ ఏమీ చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరెంట్ షాక్ తగిలి జిల్లాలో సంభవించిన మరణాల్లో ఇది 17వదని, రాష్ట్రంలో 260వదని తెలుగు రైతు సంఘం నాయకులు చెప్పారు.