జెసి బాధ్యుడు, వైయస్ ప్రోత్సాహం: బాబు
హైదరాబాద్: తమ నాయకుడు సూర్యప్రతాపరెడ్డి హత్యకు బాధ్యుడైన జె.సి. దివాకర్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సూర్యప్రతాపరెడ్డి హత్య నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 మందిని హత్య చేయించిందని ఆయన ఆరోపించారు. రాజకీయ దాడులు రాష్ట్రంలో పెరిగాయని ఆయన విమర్శించారు.
సూర్యప్రతాపరెడ్డికి తగిన భద్రత కల్పించలేదని, ముప్పు ఉందని చెప్పినా భద్రతను పెంచలేదని ఆయన అన్నారు. ప్రత్యర్థులపై కాంగ్రెస్ కక్షత తీర్చుకుంటోందని ఆయన విమర్శించారు. హత్యలను ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఖండించనైనా ఖండించడం లేదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి తమ నాయకులను హత్య చేయిస్తున్నారని, దాన్ని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ హత్యలు చేయడానికి కాంగ్రెస్ పోలీసులను వాడుకుంటోందని ఆయన అన్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్యను చంద్రబాబుతో పాటు ఇతర తెలుగుదేశం నాయకులు ఖండించారు. సూర్యప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.