జెసి సభను అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు సూర్యప్రతాపరెడ్డి హత్యకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లాలో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి సభను అడ్డుకున్నాయి. ప్రజాపథంలో పాల్గొనడానికి నిజామాబాద్ మంత్రులు జె.సి. దివాకర్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసనతో వారు అర్థాంతరంగా సభ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. జె.సి దివాకర్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, మంత్రి దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
సూర్యప్రతాపరెడ్డి హత్య వార్త అందిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలకు, రాస్తారోకోలకు దిగారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి తీసుకోకపోవడంతో వారిని పోలీసులు వారిని అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరంలలో టిడిపి కార్యకర్తలు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటలో, ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.