సూరీడి హత్యతో సంబంధం లేదు: జెసి
హైదరాబాద్/కడప: తెలుగుదేశం నాయకుడు, మాజీ శాసనసభ్యుడు సూర్యప్రతాపరెడ్డి హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అనంతపురం జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలే సూర్యప్రతాపరెడ్డి హత్యకు కారణమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సూర్యప్రతాప రెడ్డి చాలా కాలం తనతో పాటు కాంగ్రెస్ చాలా కాలం ఉన్నారని, ఆ సమయంలో సూర్యప్రతాపరెడ్డికి తాను సహకరించానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, సూర్యప్రతాపరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని ఆయన అన్నారు.
తాను సూర్యప్రతాపరెడ్డి వెంకటాద్రి ఎక్ప్ప్రెస్లో కలిసే ప్రయాణం చేశామని, దాదాపు అర గంట సేపు ఇరువురం మాట్లాడుకున్నామని అనంతపురం జిల్లాకే చెందిన మరో మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. తాను కడపలో రైలు దిగేసరికి ఉదయం అరు గంటలయిందని, సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురైనట్లు తనకు అప్పుడే తెలిసిందని ఆయన అన్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురి కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ముఠా కక్షలను అరికట్టడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.