టిడిపిి నేత సూర్యప్రతాపరెడ్డి దారుణ హత్య
అనంతపురం: తెలుగుదేశం నాయకుడు, ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కీతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి (సూరీడు) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో వచ్చిన సూర్యప్రతాప రెడ్డి తాడిపత్రి రైల్వే స్టేషన్లో దిగారు. అంగరక్షకుడి కళ్లలో కారం కొట్టి సూర్యప్రతాపరెడ్డిని హత్య చేశారు. బాంబులు, వేడకొవళ్లతో ఆయనను దారుణంగా హత్య చేశారు. సూర్యప్రతాపరెడ్డి వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యప్రతాపరెడ్డి ప్రస్తుత మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. సూరీడి హత్య మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది. సూరీడి హత్యకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది.
సూర్యప్రతాపరెడ్డి హత్య పకడ్బందీగా జరిగినట్లు అర్థం అవుతోంది. హైదరాబాద్లో ఆయన కదలికలను పసిగట్టి ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కోడలి సీమంతం కోసం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. ఆయన రైల్వే స్టేషన్లో దిగగానే ప్రత్యర్థులు దాడికి దిగారు. అంగరక్షకుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా ప్రత్యర్థులు ఆయన కంట్లో కారం చల్లారు. ఆ తర్వాత రెండు బాంబుల వేయడంతో సూర్యప్రతాపరెడ్డి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే వేటకొడవళ్లతో నరికి పారిపోయారు. అదే రైల్లో వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి తిరుపతి వెళ్తున్నారు. సూర్యర్యప్రతాపరెడ్డి గత మూడేళ్లుగా మధుమేహం, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయన అస్పత్రిలో ఉండగానే ప్రత్యర్థులు హత్యకు పథక రచన చేసినట్లు భావిస్తున్నారు. సూర్యప్రతారెడ్డి హత్యతో తాడిపత్రి, ధర్మవరంలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతాల్లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. రైల్వే స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున గుడికూడారు. పోలీసులపై సూరీడి అనుచరులు రాళ్లు రువ్వారు.
సూర్యప్రతాపరెడ్డి భౌతిక కాయానికి తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని తాడిపత్రిలోని ఇంటికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యప్రతాపరెడ్డి భౌతిక కాయంపై 25 నుంచి 30 కత్తిపోట్లు ఉన్నాయి. ఆయన రెండో కుమారుడు అమెరికా నుంచి రావాల్సి వుంది. దీంతో సూర్యప్రతాపరెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి జరుగుతాయి. ఆయన భార్య ప్రస్తుతం నాసిక్లో ఉన్నారు. సూర్యప్రతాపరెడ్డి 1999లో కాంగ్రెస్ తరఫున ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన సూర్యప్రతాపరెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. ఫిబ్రవరి 2వ తేదీన వాసాపురంలో జంట హత్యలు జరిగాయి. దీనికి ప్రతీకారంగానే సూరీడి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.