ముఠాకక్షల వల్లనే సూరీడి హత్య: వైయస్
హైదరాబాద్: ముఠా కక్షలకే తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురయ్యారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. దీన్ని రాజకీయం చేయడం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తగదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సూర్యప్రతాపరెడ్డితో 40 యేళ్లుగా తనకు సన్నిహిత సంబంధం ఉందని, సన్నిహితుడిని కోల్పోయిన బాధలో తాను ఉంటే తెలుగుదేశం అర్థరహితమైన ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. శాసనసభ్యుడి హత్యగానీ, మాజీ శాసనసభ్యుడి హత్య గానీ ముఠా కక్షల వల్లనే జరిగిందని, ఆ హత్యలకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం ఉందని, ఫాక్షనిజాన్ని నక్సలిజాన్ని అరికట్టినట్లుగానే చిత్తశుద్ధితో అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో నక్సలిజం, ఫాక్షనిజం కలగలసిపోయిందని, దీని వల్ల పరిస్థితి సంక్లిష్టంగా మారిందని ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఫాక్షనిజాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. దాన్ని గ్రహించడానికి తెలుగుదేశం పార్టీ తమను ఆడిపోసుకుంటోందని, తెలుగుదేశం తీరు మొగణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఠా కక్షలను అరికట్టడానికి తెలుగుదేశం పార్టీ సహకరించడం లేదని ఆయన విమర్శించారు. విమర్శలు మానేసి ముఠా కక్షలను అరికట్టడానికి సహకరించాలని ఆయన తెలుగుదేశం పార్టీకి సూచించారు.