రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ మాటలు: బాబు
విశాఖపట్నం: రాజకీయ లబ్ది కోసమే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)ది పచ్చి అవకాశవాదమని ఆయన విమర్శించారు. తాము ఎప్పుడూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమేనని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన గురువారం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయలసీమలోని హత్యలన్నీ కాంగ్రెస్, పోలీసుల పనేనని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ వారు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రత్యర్థులను హత్య చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ నేతలను మాత్రమే చంపుతూ ప్రభుత్వం ఫాక్షనిజాన్ని అంతం చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
ఏకపక్షంగా హత్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సాహంతో జరుగుతున్న హత్యలని ఆయన అన్నారు. ఫ్యాక్షనిజం అంటే ఒకరినొకరు చంపుకుంటారా, ఒకే వైపు హత్యలు జరుగుతాయా అని కూడా ఆయన అడిగారు. ఒక అనంతపురం జిల్లాలోనే తమ పార్టీకి చెందినవారిని 27 మందిని హత్య చేశారని, కాంగ్రెస్ వారు ఇద్దరు హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. ఫాక్షన్ హత్యలన్నింటకీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ -1 ఉప ఎన్నికకు, గంగవరం సమస్యల పరిష్కారానికి ఏ విధమైన సంబంధం లేకపోయినా గంగవరం సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో గౌతు లచ్చన్న శిలావిగ్రహాలు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్లో స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని, వంశధార ప్రాజెక్టుకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.