ఐసిసి ర్యాంకింగ్లో ధోనీ టాప్
ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసిసి) వన్డే మ్యాచ్ల ర్యాంకింగ్లో భారత బ్యాట్స్మన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి స్థానానికి ఎగబాకాడు. ఐసిసి ర్యాంకింగ్ ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఒక భారత బ్యాట్స్మన్ మొదటి స్థానం పొందడం ఇదే తొలిసారి. ఇంతవరకు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ రికీ పాంటింగ్కు రెండో ర్యాంకు దక్కింది. అబూ దుబాయ్లో పాకిస్థాన్లో జరిగిన రెండో వన్డేలో అర్థ సెంచరీ చేసిన ధోనీ ఐసిసి ర్యాంకింగ్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు.
ధోనీకి 866 పాయింట్లు రాగా, పాంటింగ్కు 805 పాయింట్లు వచ్చాయి. 42 మ్యాచ్లు ఆడిన ధోనీ అనతి కాలంలోనే అగ్ర స్థానానికి ఎగబాకాడు. ధోనీ 52.76 సగటుతో రెండు సెంచరీలు, ఎనిమిది అర్థ సెంచరీలు సాధించాడు. యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్లు మొదటి పది స్థానాల్లో స్థానం సంపాదించుకున్నారు. రాహుల్ ద్రావిడ్ తొమ్మిదో ర్యాంక్లో, యువరాజ్సింగ్ పదో ర్యాంక్లో స్థానాలు దక్కించుకున్నారు. టీమ్ ఛాంపియన్షిప్లో భారత, పాకిస్థాన్ల ర్యాంక్ల్లో ఏ మార్పూ లేదు. అబు దుబాయ్ సిరీస్ సమం కావడంతో భారత్ తొమ్మిదో స్థానంలోనూ, పాకిస్థాన్ నాలుగో స్థానంలోనూ యధావిధిగా కొనసాగుతున్నాయి. సచిన్ టెండూల్కర్, శ్రీలంక బ్యాట్స్మన్ సనత్ జయసూర్య 21 స్థానంలో ఉండగా పాకిస్థాన్తో జరిగిన రెండో వన్డేలో 73 పరుగులు చేసిన సెహ్వాగ్ తన ర్యాంక్ను కాస్తా మెరుగుపరుచుకున్నాడు. సెహ్వాగ్కు 24వ స్థానం దక్కింది.
భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్దే పైచేయిగా వుంది. పఠాన్ ఒక స్థానం పైకి ఎగబాకి మూడో ర్యాంక్ సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్ షాన్ పొలాక్ మొదటి స్థానంలోనూ, ఆస్ట్రేలియా బౌలర్ మెక్గ్రాత్ రెండో స్థానంలోనూ ఉన్నారు. వన్డే ఆల్ రౌండర్ల ఎల్జి ఐసిసి ప్లేయర్ ర్యాంకింగ్లో పఠాన్ మూడో స్థానంలో వున్నాడు. పొలాక్ మొదటిస్థానంలోనూ, ఇంగ్లాండు ఆల్ రౌండర్ ప్లింటాఫ్ రెండో స్థానంలోనూ ఉన్నారు. బౌలర్లలో మొదటి పది స్థానాల్లో చోటు దక్కిన మరో బౌలర్ హర్బజన్ సింగ్. ఇతనికి పదో ర్యాంక్ దక్కింది. కాగా, అబు దుబాయ్లో ఆడిన జట్టునే వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ గురువారంనాడు ఎంపిక చేసింది. వచ్చే నెల 18వ తేదీ నుంచి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ప్రారంభమవుతుంది. భారత జట్టు వెస్టిండీస్తో ఐదు వన్డేలు ఆడుతుంది.