సూరీడి హత్యపై నాపై టిడిపి బురద: జెసి
విజయవాడ: ధర్మవరం మాజీ శాసనసభ్యుడు సూర్యప్రతాపరెడ్డి హత్య విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై బురద చల్లుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. బురద చల్లడమే మొదటి నుంచి తెలుగుదేశం చేస్తున్న పని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకూ, సూర్యప్రతాపరెడ్డికి మధ్య ఏ విధమైన కక్షలు లేవని ఆయన అన్నారు.
సూర్యప్రతాపరెడ్డి హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్యతో తనకు ముడిపెట్టడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగుతున్నారని ఆయన అన్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్యకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. ఇద్దరు వ్యక్తులకు, రెండు గ్రూప్లకు మధ్య వున్న శత్రుత్వం వల్ల ఆ హత్య జరిగిందని ఆయన అన్నారు. సోనియా గాంధీ పర్యటన తర్వాత ఇద్దరు కాంగ్రెస్వారి హత్యలు జరిగాయని, వారి చెట్లను కూడా నరికివేశారని ఆయన గుర్తు చేశారు.