సూరీడి హత్య కేసులో నలుగురి లొంగుబాటు
అనంతపురం: తెలుగుదేశం నాయకుడు, ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కీతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కేసులోని నలుగురు నిందితులు శుక్రవారం ఉదయం తాడిపత్రి కోర్టులో లొంగిపోయారు. తాడిపత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ భోగతి నారాయణ రెడ్డి కుమారులు కుమారుడు ప్రతాపరెడ్డి, నాగేశ్వర రెడ్డి, లోకేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి లొంగిపోయినవారిలో వున్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి నారాయణ రెడ్డి అయి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. నారాయణ రెడ్డి కూడా లొంగిపోయే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్య కేసులో లొంగిపోయిన నలుగురిని అనంతపురం సబ్ జైలుకు తరలించారు. వారికి కోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
సూర్యప్రతాపరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వే స్టేషన్లో బాంబులు, వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణను దివాకర్ రెడ్డి ఖండిస్తున్నారు. వ్యక్తిగత కక్షల వల్ల ఆ హత్య జరిగిందని, ఈ హత్యలో తన ప్రమేయం ఏదీ లేదని ఆయన అంటున్నారు.