సాక్షి ఫిరోజ్ అదృశ్యంపై హైకోర్టు మండిపాటు
హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేటలో గల టాస్క్ఫోర్స్ కార్యాలయంపై దాడి కేసులో సాక్షి ఫిరోజ్ఖాన్ అదృశ్యంపై హైకోర్టు పోలీసులపై తీవ్రంగా మండిపడింది. ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం విధులకు ఇవ్వడం లేదని హైకోర్టు పోలీసులకు మొట్టికాయలు వేసింది. ఫిరోజ్ఖాన్ అదృశ్యంపై ఆయన సోదరుడి తరఫున న్యాయవాది శరత్కుమార్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రతిస్పందిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫిరోజ్ఖాన్ను ఈ నెల 28వ తేదీలోగా కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ఒక వేళ ఫిరోజ్ఖాన్ను హాజరు పరచని పక్షంలో డిజిపి స్వరణ్జిత్ సేన్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సాక్షులకు భద్రత కల్పించలేకపోవడం కేవలం పోలీసుల వైఫల్యం కిందికి మాత్రమే రాదంటూ సాక్షులకు భద్రత కల్పించలేకపోతే సాక్ష్యం చెప్పడానికి భవిష్యత్తులో ఎవరు ముందుకు వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఫిరోజ్ఖాన్ ఆచూకీని తీసి కోర్టులో హాజరుపరచడానికి యస్పి స్థాయి అధికారి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.