శిల్పాశెట్టి, రీమాసేన్లకు నాన్ బెయిలబుల్ వారంట్లు
మధురై: సినీతారలు శిల్పా శెట్టి, రీమా సేన్లకు మధురైలోని స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. ఒక తమిళ సాయంకాలం దినపత్రికలో ప్రచురణ కోసం అసభ్యంగా ఫోజులిచ్చినందుకుగాను కోర్టు ఆ వారంట్లు జారీ చేసింది. తమిళం సాయంకాలం దినపత్రిక సంపాదకుడు మురగన్కు కూడా కోర్టు వారంట్లు జారీ చేసింది. మధురైకి చెందిన దక్షిణామూర్తి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సీతారామన్ సమన్లు జారీ చేశారు. మార్చి 10వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా జడ్జి అంతకు ముందు ఆ తారలను ఆదేశించారు. ఆ ఆదేశాలకు తారలు స్పందించలేదు. ఆ సమన్లను హిందీ, ఆంగ్ల పత్రికల్లో ప్రచురించారు. అయినా వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో జడ్జి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు.
పత్రిక 2005 డిసెంబర్, 2006 జనవరి సంచికల్లో వెరీ సెక్సీ బ్లో అప్స్ను, మీడియం బ్లో అప్స్ను ప్రచురించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విధమైన ప్రచురణ మహిళా అసభ్య ప్రాతినిధ్య నిరోధక చట్టానికి, యంగ్ పర్సన్స్ హార్మ్ఫుల్ ప్బలికేషన్ యాక్ట్కు, ఐపిసి సెక్షన్ 292కు విరుద్ధమని ఆయన చెప్పారు. ఈ విధమైన ప్రచురణ యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా ఆ చిత్రాలు మహిళపై నేరాలను పెంచుతాయని ఆయన వాదించారు.