ఖరీఫ్నాటికి 11 ప్రాజెక్టుల కింద నీరు విడుదల
హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11 ప్రాజెక్టుల కింద సాగునీరు విడుదల చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఈ ప్రాజెక్టుల కింద ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమీక్షానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రతిపక్షాలు ఎంతగా అడ్డుపడినా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ప్రతిపక్షం సాగునీటి ప్రాజెక్టులను అదే పనిగా అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వివరాలను మండలాలవారీగా కాకుండా గ్రామాలవారీగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుల మీదనే 6,661 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్టర్ల నుంచి 360 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్లను రాబట్టుకున్నామని, ఇదే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమని ఆయన అన్నారు.