గంగవరం సమస్య బాబు పుణ్యమే: ఇంద్రసేన్
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే గంగవరం సమస్య తలెత్తిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. గంగవరం పోర్టు పనులను విశాఖ ఉక్కు ప్లాంట్కు గానీ, విశాఖ పోర్టు హార్బర్కు అప్పగించకపోవడం వల్ల ప్రస్తుత సమస్య ఉత్పన్నమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఈ రెండింటికి కాకుండా ప్రైవేట్ సంస్థకు గంగవరం పోర్టు పనులను అప్పగించడంలోని ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కెసిఆర్ ఎన్ని డెడ్లైన్లు పెడతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం తెస్తాననని అన్నారని, ప్రణబ్ కమిటీ నివేదిక ఇస్తానందని చంద్రశేఖర్ రావు చెప్పడమేమిటని కూడా ఆయన అడిగారు. చంద్రశేఖర్ రావు తీరు ఇదిగో పులి అదిగో వాత అన్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెరాస రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.