మద్దతిచ్చేవారెవరైనా ఆత్మీయులే: నరేంద్ర
హైదరాబాద్: తెలంగాణకు మద్దతిచ్చేవారెవరైనా తమకు ఆత్మీయులేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ)లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తమ పార్టీ నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర డ్రామాలు ఆడుతున్నారని తెరాస అసమ్మతి శాసనసభ్యుడు జయప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత సిహెచ్. విద్యాసాగరరావు విమర్శించారు. శాసనమండలి పునరుద్ధరణ బిల్లుకు ఆఘమేఘాల మీద కదిలిన కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రతిపాదనలో జాప్యం చేస్తుండడాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. తెలంగాణకు మద్దతిస్తామని తమ పార్టీ నేత ఎల్.కె. అద్వానీ చేసిన ప్రకటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చేసిన విమర్శను ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోకుండా విమర్శలు, ప్రతివిమర్శలకు దిగడం సరి కాదని ఆయన అన్నారు.