జన్మభూమికి ప్రజాపథం నకలు: బాబు
నిజామాబాద్: తమ జన్మభూమి పథకానికే పేరు మార్చి ప్రజాపథంగా చేపడుతున్నారని, ప్రజాపథం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోని పథకాలకే పేర్లు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారంనాడు నిజామాబాద్లో ప్రసంగించారు.
ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని, జలయజ్ఞం కాంగ్రెస్వారికి కమీషన్లు కట్టబెట్టడానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని ఆయన విమర్శించారు. నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ప్రకటన స్పష్టం చేస్తోందని ఆయన విమర్శించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపడానికి పోరాడాలని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో విభేదాలను సహించబోమని ఆయన హెచ్చరించారు.