నేపాల్ ప్రధానిగా గిరిజా ప్రసాద్ కొయిరాల
ఖాట్మండు: నేపాల్ ప్రధాని పదవికి గిరిజా ప్రసాద్ కొయిరాల పేరును నేపాల్లోని ఏడు రాజకీయ పార్టీల కూటమి ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఉద్యమానికి పిలుపునిచ్చిన ఏడు రాజకీయ పార్టీల కూటమి మంగళవారం ఉదయం సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశంలో రద్దయిన పార్లమెంటును పునరుద్ధరిస్తామని రాజు జ్ఞానేంద్ర గత రాత్రి ప్రకటించిన నేపథ్యంలో కూటమి ఆ నిర్ణయం తీసుకుంది. గత 19 రోజులుగా కొనసాగిస్తున్న ఉద్యమాన్ని కూటమి విరమించింది.
ప్రధాని పదవికి కొయిరాల పేరును సిపియన్ - యుయంయల్ నేత మాధవ కుమార్ నేపాలి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజు ప్రకటన ప్రజల విజయమని, సారభౌమత్వమనేది ప్రజలకు సంబంధించిందని నేపాలి కాంగ్రెస్ (డెమొక్రటిక్) నాయకుడు, మాఐ ప్రధాని షేర్ బహదూర్ దేబా సమావేశానంతరం అన్నారు. మావోయిస్టులు ఈ అంగీకారాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ లక్ష్యాల సాధనకు శాంతియుత ఉద్యమం మంచిదని తమ ఏడు పార్టీల కూటమి ఆందోళన ద్వారా వారు గ్రహిస్తారని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలనుకుంటున్నారని, రాజకీయ పార్టీలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఆందోళన సందర్భంగా మరణించినవారికి, క్షతగాత్రులకు తగిన పరిహారం చెల్లించాలని కూడా సమావేశం తీర్మానించింది. ఆందోళనలో 16 మంది మరణించగా, ఐదు వేల మందికి పైగా గాయపడ్డారు.