హత్యలపై శ్వేతపత్రానికి బాబు డిమాండ్
నిజామాబాద్: కడప జిల్లా పులివెందుల, అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభా నియోజకవర్గాల్లో జరిగిన హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ హత్యలపై ప్రత్యేక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. హత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులలో, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి నియోజకవర్గం తాడిపత్రిలో అత్యధికంగా హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. పార్టీ నేతలను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. హత్యలను నివారించలేకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు. పోలీసు అధికారులను కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మాటి మాటికి తమపై ముఖ్యమంత్రి తమపై నింద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే తప్ప చట్టాన్ని పకడ్బందీగా అమలు కావడానికి చర్యలు తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. మున్పిపల్ ఎన్నికలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి వుంటే కాంగ్రెస్ కొట్టుకుపోయి వుండేదని ఆయన అన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలోని అంతర్గత కలహాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.