బాబుపై ఐయంజి భూముల కేసు కొట్టివేత
హైదరాబాద్: ఐయంజి భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఐయంజి భూములను అప్పగించడంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై పెట్టిన కేసుల్లో పస లేదని ఐయంజి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేయడం ద్వారా తెలిసిపోతోందని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలపై ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శర్మను బదిలీ చేసిందని వారు వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లతో పాటు అన్ని ప్రాజెక్టుల ఫైళ్లను స్పీకర్ వద్ద పెడితే ప్రభుత్వ అవినీతిని రుజువు చేస్తామని వారన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలు పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను జాతీయ స్థాయిలో చర్చకు పెడతామని వారు చెప్పారు. ఈ విషయమై తాము ప్రధానికి, రాష్ట్రపతికి, ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.