వలసలు నివారిస్తాం: ముఖ్యమంత్రి
నిజామాబాద్: వలసలను నివారించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన బుధవారం ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు ఇస్తామని, ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పచ్చ చొక్కాలవారికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని, మిగతా వారు చెప్పులు అరిగిపోయేలా తిరిగినా ఫలితం దక్కలేదని, తాము అర్హులందరికీ రేషన్కార్డులు ఇస్తామని ఆయన అన్నారు.
రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం పట్టణాల్లో ముగిసిందని, గ్రామాల్లో ప్రారంభించామని ఆయన చెప్పారు. పనులు తక్కువగా ఉన్నాయని చెప్తే అటువంటి వారికి వెంటనే పనులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు ఏడాదికి కేవలం 300 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఇచ్చారని, తాము ఈ ఏడాది పావలా వడ్డీకి 3 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్క నిజామాబాద్ జిల్లాకే 300 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ఆయన చెప్పారు.