తెలంగాణ ఏర్పాటును ఎప్పుడూ వ్యతిరేకించలేదు: అద్వానీ
భోపాల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను ఏనాడూ వ్యతిరేకించలేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ను వేయాలనే కాంగ్రెస్ ఆలోచనను తాను కేంద్ర హోం మంత్రికి ఉన్నప్పుడు వ్యతిరేకించానని ఆయన వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును యన్డిఎ ప్రభుత్వ హయాంలో వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వివరణ ఇచ్చారు. తెలంగాణ విషయంలో ద్వంద్వవైఖరి అవలంభించేవారు, ద్రోహపూరితంగా వ్యవహరించేవారు కాంగ్రెస్ అధ్యక్షులే తప్ప తాను కాదని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించినట్లు వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా వున్నాయని, తెలంగాణ విషయంతో తన వైఖరి స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. 2002 జనవరి 5వ తేదీన తాను సోనియాకు రాసిన లేఖలో తాను తెలంగాణను వ్యతిరేకించినట్లు ఏ రూపంలోనైనా ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణపై బిజెపి వైఖరిపై అయోమయం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతు తెలియజేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో యుపిఎ ప్రభుత్వం ఏ విధమైన జాప్యం చేసినా అది కాంగ్రెస్ ద్వంద్వవైఖరే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, దాని మిత్రపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 2004 ఎన్నికల్లో వాగ్దానం చేశాయని, రెండేళ్లు గడిచినా ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్లో తీవ్రమైన విభేదాలు ఉండడమే కారణమని ఆయన అన్నారు. ఏదో ఒక కారణంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును జాప్యం చేస్తూ తమపై నిందలు మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తాను కొత్తగా రాష్ట్రాల పునర్విభజన కమీషన్ను వ్యతిరేకిస్తున్నానని, ఆ కమీషన్ ఏర్పడితే ఇతర రాష్ట్రాల కోసం అనవసరమైన డిమాండ్లు, ఆందోళనలు పెరుగుతాయని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం రావాలనేది మాత్రం తాను చెబుతున్నానని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో స్నేహం వల్ల తెలంగాణను, మహారాష్ట్రంలో శివసేనతో స్నేహం వల్ల విదర్భను కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయలేకపోయామని ఆయన వివరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉందని, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆ ప్రభుత్వం తీర్మానం చేసే స్థితి లేదని ఆయన అన్నారు.