మే నెలలోనే విజయోత్సవ సభ: కెసిఆర్
హైదరాబాద్: ఏ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ సాధిద్దామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు చేస్తే ఉద్యమం చేస్తారని, లేకుంటే చప్పుడు చేయరని, ఇది తెలంగాణ ప్రజల మనస్తత్వమని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటయిన ప్రతినిధుల సభలో ఆయన ప్రసంగించారు. తెరాస ఏర్పడి నేటికి ఐదేళ్లు. తమది స్ట్రీట్ ఫైట్ కాదని, స్టేట్ ఫైట్ అని ఆయన అన్నారు. సమైకాంధ్ర అనడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వమని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమ వార్తలను వక్రీకరించి రాయొద్దని ఆయన పత్రికలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని అర్థం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మవద్దని కూడా ఆయన కోరారు.
మే నెలలోనే విజయోత్సవ సభలు నిర్వహించుకుందామని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మే నెలలో ప్రకటన వెలువడడం ఖాయమని ఆయన అన్నారు. బిజెపి మద్దతు ప్రకటించినందున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకు తిరుగులేదని ఆయన అన్నారు. తమకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంపై, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం మినహా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గడువు పెట్టింది తాము కాదని, కాంగ్రెస్ పార్టీయే గడువు పెట్టిందని తెరాస మరో అగ్రనేత ఎ. నరేంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అందరికీ ఆమోదయోగ్యమేనని ఆయన అన్నారు.