తెలంగాణపై అద్వానీ ప్రకటనలు అయోమయం: కెకె
హైదరాబాద్: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు విమర్శించారు. అద్వానీపై తనకు గౌరవం ఉందని, అయితే అద్వానీ మాటలపై తనకు నమ్మకం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు దేశవిచ్ఛిన్నతకు దారి తీస్తుందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అద్వానీ గతంలో అన్నారని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది కాబట్టి తెలంగాణ ఏర్పాటు ప్రసక్తే లేదని కూడా అద్వానీ అన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై అద్వానీ ఐదు రకాల ప్రకటనలు చేశారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై దాఖలైన ఐయంజి భూముల వ్యవహారానికి సంబంధించిన కేసును కోర్టు కొట్టివేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాబట్టి తాను జోక్యం చేసుకోబోనని హైకోర్టు చెప్పడం దురదృష్టకరమని, దేశాన్ని అమ్మాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కూడా ఏమీ చేయలేని పరిస్థితి వుంటుందా అని ఆయన అన్నారు.