ఆత్మరక్షణ కోసమే అజ్ఞాతం: దామోదర్ రెడ్డి
నల్లగొండ: తానేం అజ్ఙాతంలోకి వెళ్లలేదని, ఆత్మరక్షణ కోసమే తన మిత్రులను వద్ద తలదాచుకున్నానని నల్లగొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. కొందరు పోలీసు అధికారుల మీద నమ్మకం లేకనే అంగరక్షకులని పంపించివేశానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అంగరక్షకులకు తెలియకుండా ఆయన ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లారు. గురువారంనాడు ఆయన అజ్ఞాతం వీడారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డే తన బాస్ అని, వైయస్ చెప్పిందే తాను చేశానని ఆయన అన్నారు. తుంగతుర్తి అభివృద్ధి హోం మంత్రి కె. జానారెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. నల్లగొండ యస్పీ రాజకీయ నేతగా మారాడని ఆయన ఆరోపించారు. పోలీసు రక్షణను ఆయన తిరస్కరించారు. ఆత్మకూరులో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హోం మంత్రి కె. జానారెడ్డితో ఆయన తీవ్రంగా విభేదిస్తున్నారు. దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డికి మొదటి నుంచి కూడా సన్నిహితులు.