రాయలసీమలో 11 మంది నక్సల్స్ హతం
కడప: రాయలసీమలో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతులను గుర్తించలేదు. అయితే హతుల్లో అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో 30 మంది నక్సల్స్ పాల్గొన్నారని, మిగతా వారు పారిపోయారని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్ జిత్ సేన్ హైదరాబాద్లో చెప్పారు. పారిపోయినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని సుండుపల్లె అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఎన్కౌంటర్ ఉదయం ఆరున్నర గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలసులు స్వాధీనం చేసుకున్నవాటిలో ఒక టెంట్, 25 కిట్ బ్యాగులు, 2 ఎస్యల్ఆర్ గన్లు, ఒక 303 రైఫిల్, మూడు సింగిల్ బ్యారెల్ గన్లు ఉన్నాయి. నక్సలైట్లు అక్కడ రాజకీయ, మిలటరీ శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక ఎన్కౌంటర్లో ఇంత పెద్ద యెత్తున నక్సల్స్ చనిపోవడం ఇదే మొదటిసారి.