తెలంగాణపై అద్వానీ మాట మార్పు: బాబు
ఆదిలాబాద్: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ మాట మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తెలంగాణ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) ఎజెండాలో లేదని ఆయన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై గడువులు పెట్టడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందింది, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని అద్వానీ గతంలో అన్నారని ఆయన గుర్తు చేశారు. యన్డిఎ అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ తెలంగాణకు మద్దతు మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలంగాణ డిమాండ్పై తాము మొదటి నుంచి స్పష్టంగా ఉన్నామని, తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో రకంగా విభజించకూడదని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సిపియం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకోవడంపై తానేమీ వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు.