తాలిబన్ల చెరలో హైదరాబాదీ ఇంజనీరు
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో తాలిబాన్లు హైదరాబాద్కు చెందిన ఎ. సూర్యనారాయణ అనే ఇంజనీర్ను కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఇ. అహ్మద్ ధృవీకరించారు. అఫ్గానిస్థాన్లో టెలికమ్, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్న బహ్రేనీ కంపెనీ ఆల్ మయ్యాద్ అనే కంపెనీలో పని చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫ్గానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని, బహ్రేనీ కంపెనీని సంప్రదిస్తోంది.
జాబుల్ రాజధాని కలత్ నుంచి గజ్నీకి ప్రయాణిస్తుండగా సూర్యనారాయణ శుక్రవారం సాయంత్రం కిడ్నాప్నకు గురయ్యారు. 24 గంటల్లో భారతీయులందరూ అఫ్ఘాన్ విడిచివెళ్లకపోతే సూర్యనారాయణకు ప్రాణహాని తప్పదని తాలిబాన్లు హెచ్చరించారు. హైదరాబాద్లోని సూర్యనారాయణ కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సూర్యనారాయణను విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత నాలుగు నెలల కాలంలో భారతీయులు కిడ్నాప్కు గురి కావడం ఇది నాలుగోసారి. జరంజ్ దేలారామ్ హైవే నిర్మాణంలో పని చేస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జవాన్ మణియప్పన్ ఆర్ కుట్టిని తాలిబాన్లు నాలుగు నెలల క్రితం కిడ్నాప్ చేశారు. మూడు రోజుల తర్వాత అతని శవం కాందహార్ ప్రొవిన్స్లో దర్శనమిచ్చింది. టర్కిష్ కంపెనీలో పనిచేస్తున్న భారత ఇంజనీర్ భరత్ కుమార్ 2006 ఫిబ్రవరిలో బాంబు పేలుళ్లలో మరణించాడు. అఫ్గానిస్థాన్లోని వివిధ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు తాలిబన్ల నుంచి బెదిరింపులు వచ్చాయి.