లగడపాటి, మర్రి, పిజెఆర్లకు షోకాజ్లు
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా లగడపాటి బహిరంగ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లగడపాటి ఆ ఆరోపణలు చేశారు.
లగడపాటికే కాకుండా నగర పార్టీ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డికి, పి. జనార్దన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిపై వీరిద్దరూ బహిరంగ విమర్శలు చేశారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుతో మాట్లాడినట్లు లగడపాటి అదే ప్రైవేట్ టీవీ ఛానల్తో అన్నారు. తాను సిడిని అధిష్ఠానానికి పంపానని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని, కొన్ని వాస్తవాలను మాట్లాడానని ఆయన అన్నారు. లగడపాటి, మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డిలపై చర్య తీసుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నుంచి లేఖ అందిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. దిగ్విజయ్ నుంచి లేఖ అందిందని, అయితే ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.